08-05-2025 02:47:39 PM
హనుమకొండ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య.
హనుమకొండ,(విజయ క్రాంతి): భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తోందని కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. భూ భారతీ రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం నడికూడ మండల కేంద్రంలో, నడి కూడ మండలం చర్లపల్లి గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, హెల్ప్ డెస్క్ తదితర వాటిని సందర్శించి, రైతుల నుండి అర్జీలు స్వీకరిస్తున్న తీరును పరిశీలించారు. సదస్సులతో భేటీ అయ్యి, వారి సమస్యలను అడిగి తెలుసుకుని సందేహాలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా భూభారతి విధివిధానాల గురించి, చట్టంలో పొందుపర్చిన అంశాలపై అవగాహన కల్పించారు. రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు అందుబాటులో ఉంటూ భూ సంబంధిత సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన మీదట నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ సూచించారు. రైతులు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సదస్సులలో పరకాల ఆర్డీఓ నారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మంగీలాల్ , గృహ నిర్మాణ శాఖ అధికారి రవీందర్, తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో విమల, మండల వెరిఫికేషన్ అధికారి హారిక, ఇతర అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.