06-05-2025 12:21:29 AM
కలెక్టర్ గౌతమ్
మేడ్చల్, మే 5(విజయ క్రాంతి): భూభారతి చట్టం అమలులో భాగం గా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గౌతం సూచించారు. భూ భారతీలో పైలట్ ప్రాజెక్ట్ గా ఎం పికైన కీసర మండలంలో రెవెన్యూ సదస్సులు సోమవారం ప్రారంభమయ్యాయి. ధర్మారం గ్రామంలో నిర్వహించిన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా సదస్సు నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. రైతులు అందించిన దరఖాస్తులను, సిబ్బంది పనితీరును పరిశీలన జరిపి, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు.
భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. ధరణిలో పెండింగ్ ఉన్నవా, లేవా అని ముందుగా అడిగి తెలుసుకుని, ధరణిలో పెండింగ్ లో ఉంటే ధరణి లో ఉన్న నంబరు ఆ ధరఖాస్తు పై వేసి ఆన్ లైన్ లోనే వాటిని పరిష్కరించాలన్నారు. దరఖాస్తులను సమస్యల వారిగా విడివిడిగా బంచులుగా చేసుకొవాలన్నారు.
దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి అప్పటికప్పుడే పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. అనంతరం నర్సంపల్లిలో నిర్వహిస్తున్నరెవెన్యూ సదస్సును కూడా పరిశీలించి కలెక్టరు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.
ఈ సదస్సులలో లా ఆఫీసర్ చంద్రావతి, కీసర ఆర్డిఓ ఉపేందర్ రెడ్డి, ఎంఆర్ఓ అశోక్, రెవెన్యూ సిబ్బంది, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. కాగా ధర్మారం గ్రామంలో రైతుల నుంచి 47, నర్సంపల్లి గ్రామంలో 33 దరఖాస్తులు వచ్చాయి.