06-05-2025 01:24:13 AM
పైలట్ ప్రాజెక్టు కింద ఆత్మకూరు (ఎం) మండలం ఎంపిక
యాదాద్రి భువనగిరి, మే 5 (విజయక్రాంతి): జిల్లాలో భూభారతి చట్టం అమలులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఆత్మకూర్ (ఎం) మండలం ఎంపిక అయింది.సోమవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూర్ మండలంలోని రాయిపల్లి, సర్వేపల్లి గ్రామాలలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ రెవెన్యూ వీరారెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూ సమస్యలకు ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి (ఆర్ ఓ ఆర్ చట్టం) అమలులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఆత్మకూర్ (ఎం )మండలాన్ని ఎంపిక చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ సదస్సులో ముందుగా ఆ గ్రామంలోని భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలను తెలియజేయాలని, ఆ పై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం అనంతరం చేయడం జరుగుతుందన్నారు.
రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పులు, ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మీ గ్రామంలోనే మీ ఇంటి దగ్గరకే వచ్చి రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కరిస్తారన్నారు. భూ భారతి లో దరఖాస్తు పెట్టుకుంటే భూ భారతి రైతులు అర్జీతోపాటు పాస్ పుస్తకం సమస్యలకు సంబంధించిన ఆధారాలను అధికారులకు అందజేయాలని, అందజేసిన రోజే రెవెన్యూ అధికారులు మీ గ్రామంలోనే పరిశీలించి ,కోర్టు పరిధిలో ఉన్న ఆర్జీల మినహా మిగతా వాటిని పరిష్కరిస్తారన్నారు.
గ్రామానికి సంబంధించిన పూర్తి రెవెన్యూ దస్త్రాలను తీసుకొని గ్రామాల్లోకి అధికారుల బృందం వస్తుందన్నారు. సమస్య యొక్క దరఖాస్తులను రెవెన్యూ అధికారులు పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తారన్నారు. తీసుకున్న ప్రతి అర్జీని కంప్యూటర్లో నమోదు చేసి రసీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. తీసుకున్న అర్జీలను అదే రోజు గ్రామంలో పరిశీలించి అవసరం అయితే క్షేత్రస్థాయిలో విచారిస్తారన్నారు.
వివాదాలు లేని అర్జీలను పరిశీలించి రెవెన్యూ దస్త్రాలను ప్రక్షాళన చేసి పరిష్కార పత్రాలను జూన్ 2వ తేదీ న అందజేస్తారన్నారు. భూ భారతి సేవలు గ్రామంలో రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గ్రామ రెవెన్యూ సదస్సులలో ఆర్డీవో కృష్ణారెడ్డి, ఇన్చార్జి తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.