calender_icon.png 7 May, 2025 | 1:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు దాటుతుండగా ముగ్గురిని ఢీకొట్టిన కారు: ఒకరు మృతి

06-05-2025 10:50:30 PM

ఇద్దరికీ తీవ్ర గాయాలు..

చేగుంట/నార్సింగి: రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం(కారు) ఢీకొట్టగా ఒకరు మృతి చెందగా, ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని జాతీయ రహదారి 44 వల్లూరు వద్ద చోటుచేసుకుంది. స్థానిక ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్(SI Ahmed Mohiuddin) తెలిపిన వివరాల ప్రకారం... చేగుంట మండలం వల్లభాపూర్ కు చెందిన పోచమ్మల మారవ్వ(60), పోచమ్మల రామయ్య(64), రుక్మాపూర్ గ్రామానికి చెందిన మైలారం దశరథ్(45) ముగ్గురు చేగుంట వైపు నుంచి వస్తూ వల్లభాపూర్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతున్నారు.

ఈ క్రమంలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న గుర్తు తెలియని కారు.. డ్రైవర్ కారును అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ ముగ్గురిని ఢీకొట్టి పారిపోయాడు. ఈ ఘటనలో పోచమ్మల మారవ్వ అక్కడిక్కడే మరణించగా, రామయ్య, దశరథ్ లకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ, సిబ్బందితో పాటు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన రామయ్యను చికిత్స నిమిత్తం రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా, దశరథ్ కు నార్సింగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనలో మరణించిన మారవ్వ మృతదేహానికి పోస్ట్ మార్టం నిమిత్తం రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్ఐ అహ్మద్ మోహిఉద్దీన్ వివరించారు.