18-08-2025 12:42:41 AM
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ విష్ణు
తుంగతుర్తి, ఆగస్టు 17 : జిల్లాలోని తుంగతుర్తి లో ఆర్ ఎం పి చికిత్స వికటించి 26సంవత్సరాల గర్భిణీ విజిత మృతి పై స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం సుమోటో గా స్వీకరించింది. ఆదివారం తుంగతుర్తి కి చేరుకున్న విచారణ బృందం అధికారి డా గుండగాని శ్రీనివాస్, డా విష్ణు ల బృందం గర్భిణీకి చికిత్స చేసిన నకిలీ వైద్యుడు /ఆర్ ఎం పి శ్రీనివాస్ నిర్వహిస్తున్న అక్రమ ఆసుపత్రి పైన విస్తుపోయే నిజాలు వెలుగు తీశారు.
సదరు ఆర్ ఎం పి శ్రీనివాస్ గత కొన్ని సంవత్సరాలు గా ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా సాయి బాలాజీ ఆసుపత్రి నిర్వహించడం తో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలకు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు గుట్టు చప్పుడు కాకుండా తనతోటి ఆర్ ఎం పి లు కొందరి తో కలిసి ఒక మాఫియా లాగ తయారు అయి లింగ నిర్ధారణ పరీక్షలు తో పాటు గర్భ విచ్చిత్తి ని అక్రమంగా కొన్ని సంవత్సరాలనుండి ప్రోత్సహిస్తునట్టు స్థానికుల నుండి సమాచారం సేకరించారు.
నిందితుడు ఆర్ ఎం పి శ్రీనివాస్ పోలీసులు వెతికే పనిలో ఉన్నారని ఇంకా ఎంత మందికి అబార్షన్లు చేసింది, ఎంత మంది ఇతర ఆర్ ఎం పి ల పాత్ర ఇందులో వుంది అనేది విచారణ లో తేలనుందని డా జి. శ్రీనివాస్ తెలియ చేశారు. గతంలో కూడా ఈ అక్రమ దందాపై స్థానికులు కొందరు జిల్లా వైద్యధికారికీ సమాచారం ఇచ్చిన కూడా ఎటువంటి చర్యలుతీసుకోలేదని,
అపుడు సరిఅయినా చర్యలు తీసుకొని ఈరోజు ఒక నిండు గర్భిణీ మృతి చెంది ఉండక పోవు అని తెలంగాణ వైద్య మండలి వైస్ చైర్మన్ డా జి. శ్రీనివాస్ కి స్థానికులు తెలియ చేశారు. ప్రస్తుత సూర్యాపేట జిల్లా వైద్యధికారి డా చంద్రశేఖర్ ని ఫోన్ లో సంప్రదించగా గతంలోని ఫిర్యాధులు తన దృష్టికి రాలేదని ఇటీవలే ఇంచార్జి గా నియమితులు అయి వచ్చానని ఇటువంటి అక్రమ గర్భ విచ్చిత్తి గాని, ఇంజెక్షన్స్ వేయడం, ఆపరేషన్ లు వంటి చికిత్సలు నిర్వహించే ఆర్ ఎం పి పై తప్ప కుండ చర్యలు తీస్కుంటామని హామీ ఇచ్చారు.సదరు ఆర్ ఎం పి శ్రీనివాస్ పై ఎన్ ఎం సి చట్ట ప్రకారం కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు తెలియచేసారు.