14-01-2026 02:08:30 AM
‘డ్రా’లో ఎవరి జాతకం మారుతుందో?
మారుతున్న లెక్కలు.. ఆశావహుల గుండెల్లో మొదలైన రైళ్లు!
రిజర్వేషన్లను ఖరారు చేస్తూ బీసీ డెడికేటెడ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక
రెండు మూడు రోజుల్లో రానున్న షెడ్యూల్!
రంగారెడ్డి, జనవరి 13 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే జిల్లా రాజకీయాల్లో రిజర్వేషన్ల సెగ మొదలైంది. ఓటర్ల జాబితా కు సంబంధించిన కార్యక్రమాలు అధికారులు మరింత స్పీడప్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ రెండు, మూడు రోజులో ముహూర్తం ఖరారు కావడంతో, అందరి చూపు ఇప్పుడు ‘రిజర్వేషన్ల లాటరీ’ పైనే ఉంది. అసలేం జరగబోతోంది? పాత వారు పట్టు నిలుపు కుంటారా? కొత్తవారికి అవకాశం దక్కుతుందా? అన్న ఉత్కంఠ అటు ఆయా పార్టీ లో ఉన్న నాయకుల్లో, ఇటు ఓటర్లలో పతాక స్థాయికి చేరింది.
మున్సిపల్న్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తోంది. డివిజన్ల వారీగా ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించగా, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఈ నెల 12వ తేదీన ఓటర్ల తుది జాబితాను ఆయా మున్సిపాలిటీ లో అధికారులు ప్రదర్శించారు. ఈ నెల 16వ తేదీ నాటికి ఫోటోలతో కూడిన జాబితా సిద్ధం కానుండటంతో, ఇక మిగిలింది కేవలం ’రిజర్వేషన్ల’ ప్రకటన మాత్రమే. దీంతో మున్సిపాలిటీ ఎన్నికల కోలహలం నెలకొంది.
ఇంకా విడుదల కానీ మార్గదర్శకాలు..
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఖరారు కాలేదు. దీంతో ఆయా మున్సిపాలిటీ లో రిజర్వేషన్లపై పలు ఊహగానాలు చక్కర్లు కొడుతున్నాయి. రొటేషన్ పద్ధతా.. లేక సరికొత్త వ్యూహమా? పాత పద్ధతా.. లేక ప్రభుత్వం కొత్త విధానం తీసుకొస్తుందా అని ప్రభుత్వం ఏ నిర్ణయం అవలంబిస్తుందోనని పలువురు ఆశావావులు ఎదురు చూస్తున్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు, బీసీ ఓటర్ల సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు.
రొటేషన్పై సస్పెన్స్..
ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో అనుసరించిన ‘రొటేషన్’ విధానాన్నే ఇక్కడ కూడా అమలు చేస్తారా? అన్నది పెద్ద ప్రశ్న. జిల్లాలో కొత్తగా చేవెళ్ల, మొయినాబాద్ మున్సిపాలిటీలు ఏర్పడగా.. గతం లో జిల్లా లో ఉన్న ఎనిమిది మున్సిపాలిటీలు, మూడు కార్పొరేషన్లు ఇటీవల జిహెచ్ఎంసిలో ప్రభుత్వం విలీనం చేసింది. కాబట్టి జిల్లా లో ఆరు మున్సిపాలిటీ లకు ఎన్నికలు జరగడం తో పాత రిజర్వేషన్లు తలకిందులయ్యే అవకాశం ఎక్కువగా ఉండొచ్చనే అధికారులు సూత్రపాయంగా వెల్లడిస్తున్నారు.
రిజర్వేషన్లపైనే అందరి చూపు..
స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. దాని ప్రకారం మున్సిపాలిటీ లో చైర్మన్లు,వార్డుల వారిగా రెండు మూడు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. ఎస్సీ,ఎస్టీలకు కలిపి 15% బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలో ఎస్సీ ఎస్టీ,బీసీ, జనరల్, మహిళా కోటా కు సంబంధించిన రిజర్వేషన్ల మార్గదర్శాకాల ప్రకారం అధికారులు చైర్మన్, వార్డులకు రిజర్వేషన్లు కేటాయిస్తారు. మున్సిపాలిటీ మొత్తంలో సగం స్థానాలు మహిళలకే కేటాయిస్తారు కాబట్టి, డ్రా పద్ధతిలో ఎవరికి ఏ సీటు వస్తుందోనని పురుష అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.
‘చైర్మన్ పీఠం ఎవరికి?’
నరల్, రిజర్వేడ్ కేటగిరీకా .. ఎవరికీ ఏ రిజర్వ్ అవుతుంది? ఒకవేళ అయితే అది ఏ వర్గానికి దక్కుతుంది? అనే దానిపై ఆయా మున్సిపాలిటీ వ్యాప్తంగా రిజర్వేషన్ల స్థానాలపైనే అందరిలో చర్చలు సాగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన కొందరు నేతలు ఏళ్ల తరబడి ఒకే డివిజన్ను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు మారితే వారి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. అందుకే, మార్గదర్శకాలు వచ్చే వరకు ప్రతి ఒక్కరూ ఊపిరి బిగబట్టి ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు ఆయా పార్టీ లకు రాజకీయాల్లో అత్యంత కీలకం కానున్నాయి!
త్వరలోనే షెడ్యూల్..
రిజర్వేషన్లపై మున్సిపాలిటీకి బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించడంతో పాటు ఓటర్ల తుది జాబితా ను వెల్లడించడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమం అయింది. ఇక ఎన్నికల సంఘం త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం మెండుగా ఉంది. 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ లకు రిజర్వేషన్లు ఇలా కేటాయించారు.
1) ఆమనగల్లు (ఎస్టీ జనరల్), 2) షాద్నగర్ (బీసీ జనరల్), 3) కొత్తూరు (బీసీ మహిళ), 4) శంకర్పల్లి (జనరల్ మహిళ ), 5) ఇబ్రహీంపట్నం( ఎస్సీ మహిళ ).