17-12-2025 12:10:10 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్
కొల్చారం, డిసెంబర్ 16 :శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలింగ్ జరిగే మండలాల్లో, గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బిఎన్ఎస్ 163 చట్టం అమల్లో ఉంటుందని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం కొల్చారం మండల కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ ను గ్రామ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 161 సర్పంచ్ స్థానాలకు, 1220 వార్డు స్థానాలకు మూడో విడత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని అన్నారు. పోలింగ్ స్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.
మొదటి, రెండో విడత పోలింగ్ నమోదులో మెదక్ జిల్లా 89 శాతం నమోదు చేసి రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉన్నదన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుని ఓటింగ్ శాతం నమోదులో మన జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. మూడో విడత ఎన్నికలు జరిగే పంచాయతీలలో 163 బీఎన్ఎస్ చట్టం పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చట్టం 18వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఉంటుందని తెలిపారు.జిల్లాలో ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పాటించాలని సూచించారు.