27-12-2025 02:12:44 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 26 (విజయక్రాంతి): ‘తెలంగాణలో ఇంకా ఈ ఏజెన్సీల దారి దోపిడీ ఎందుకు. గరీబోడు కష్టపడితే వచ్చే జీతంలో జీఎస్టీ, కమీషన్ల పేరుతో కోతలు విధించి కార్మికుల రక్తాన్ని తాగుతున్నారు. తక్షణం దళారీ వ్యవస్థ లాం టి ప్రైవేట్ ఏజెన్సీలను రద్దు చేసి, ప్రభుత్వమే స్వయంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి’ అని తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ జేఏసీ చైర్మన్ పులి లక్ష్మ య్య డిమాండ్ చేశారు.
ప్రైవేట్ ఏజెన్సీలను పూర్తిగా తొలగించాలని, దళారులు లేకుండా ట్రెజరీ ద్వారా నేరుగా జీతాలు చెల్లించాలని, కార్మికులకు ప్రమాద బీమా, కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలని, ఏపీ, యూపీ తరహాలో తెలంగాణ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చే యాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేర కు శుక్రవారం అవుట్ సోర్సింగ్ జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.
రాష్ట్రంలో లక్షలాది మంది అవు ట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల చేతిలో, అధికారుల పెత్తనం కింద నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే కార్మికుడికి ఇచ్చే అరకొర జీతం లో.. జీఎస్టీ, ఏజెన్సీ కమీషన్ల పేరుతో ఒక్కో మనిషిపై సుమారు రూ. 4,000 వరకు కోత విధిస్తున్నారని లక్ష్మయ్య మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం రేవంత్రెడ్డి స్పందించి అవుట్ సోర్సింగ్ బిడ్డల బతుకుల్లో వెలుగులు నింపాలని కోరారు.