19-08-2025 01:55:20 AM
మెదక్, ఆగస్టు 18 (విజయక్రాంతి)/పాపన్నపేట/తూప్రాన్: మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. సింగూరు నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో భారీ స్థాయిలో వరద నీరు గణపురం ప్రాజెక్టుకు చేరుకుంటుంది. ఈ ప్రాజెక్టు నిండుకుండలా మారి పొంగిపొర్లుతోంది. దీంతో పాయల ద్వారా వరద ఉప్పొంగి ప్రవహించడం వల్ల ఏడుపాయల ఆలయ ముఖద్వారం ఎత్తువరకు నీరు ప్రవహిస్తుంది.
అలాగే తూప్రాన్ మండలం పరిధిలోని యావాపూర్ సమీపంలో ఉన్న హల్దీవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఆబోతుపల్లి వద్ద కూడా ఈ వాగు తీవ్రస్థాయిలో ప్రవహిస్తోంది. వెంకటరత్నాపూర్, వెంకటాయపల్లి, యావాపూర్, ఘనపూర్ గ్రామాల పరిధిలో పంట పొలాలు పూర్తిగా నీటితో జల మయమయ్యాయి. ఆదివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు తూప్రాన్ మున్సిపల్ పెద్ద చెరువు అలుగు పోయడంతో చెరువు కింది భాగం లో ఉన్న వరి పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. కిష్టాపూర్ ఆనకట్ట పొంగిపొర్లుతుంది.