07-01-2026 12:00:00 AM
-ప్రధానోపాధ్యాయులు పోశాల వీరమల్లు
వెంకటాపూర్, జనవరి 6 (విజయక్రాంతి): విద్యార్థుల్లో అక్షర సౌందర్యం పెంపొందించేందుకు హస్తలేఖన పోటీ ఎంతో దోహదపడుతుందని ప్రిన్సిపల్ పోశాల వీరమల్లు అన్నారు. మండల కేంద్రంలోని వేదవ్యాస ఉన్నత పాఠశాలలో మంగళవారం మంచి హస్తలేఖన పోటీను నిర్వహించగా.. ఈ పోటీలో 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గీతల పేపర్లో నిర్ణీత సమయానికి పేరాగ్రాఫ్ లేదా కథను శ్రద్ధగా రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.
పోటీ నిర్వహణ సమయంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తూ విద్యార్థులకు అవసరమైన మార్గనిర్దేశం అందించారు. అక్షరాల స్పష్టత, సమతుల్యత, శుభ్రత, విరామ చిహ్నాల సరైన వినియోగం వంటి అంశాలను ఆధారంగా చేసుకొని మూల్యాంకనం చేయనున్నట్లు వీరమల్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వీరమల్లు మాట్లాడుతూ.. మంచి హస్తలేఖనం కేవలం అందమైన రాతకే పరిమితం కాదని అది విద్యార్థుల క్రమశిక్షణ, సహనం, నేర్చుకునే పట్ల గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల అకాడమిక్ నాణ్యతతో పాటు వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.