10-10-2025 12:27:08 AM
చెన్నై, అక్టోబర్ 9: దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్డ్రిఫ్ దగ్గు మందు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్లో 20 మంది పిల్లల మృతికి కారణమైన ఫార్మా కంపెనీ యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ దగ్గు మందు తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మా యజమాని రంగనాథన్ అరెస్టయ్యారు. మధ్యప్రదేశ్ పోలీసులు బుధవారం అర్ధరాత్రి తర్వాత చెన్నైలోని కోడంబాక్కంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, గుణ, శివపురి జిల్లాల్లో ’కోల్డ్రిప్’ అనే దగ్గు మందును వాడిన తర్వాత సుమారు 20 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురై మరణించారు. ఈ సిరప్ను తమిళనాడులోని కాంచీపురం జిల్లా సుంగువార్ చత్రంలో ఉన్న ’శ్రేసన్ ఫార్మా’ అనే యూనిట్ తయారు చేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన అధికారులు, ల్యాబ్ పరీక్షల కోసం సిరప్ నమూనాలను పంపించారు.
ఈ పరీక్షల్లో సిరప్లో ’డైఇథిలిన్ గ్లైకాల్’ (డీఈజీ) అనే అత్యంత ప్రమాదకరమైన రసాయనం ఉన్నట్లు తేలింది. సాధారణంగా పెయింట్లు, ఇంకుల త యారీలో వాడే ఈ రసాయనం వల్ల చిన్నారుల్లో కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిని మరణాలు సంభవించాయని అధికారులు నిర్ధారించారు. జలుబు, దగ్గు కోసం వైద్యులు సూచించిన ఈ సిరప్ వాడిన కొన్ని రోజులకే చిన్నారులు అనారోగ్యం పాలయ్యారు.
మెరుగైన చికిత్స అందిం చినప్పటికీ చాలా మంది ప్రాణాలు కోల్పోయా రు. మరో 40 మంది చిన్నారులు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, దీంతో మృతు ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ’కోల్డ్రిప్’ సిరప్ అమ్మకాలు, పంపిణీపై నిషేధం విధించింది.
ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దేశవ్యాప్తంగా ఈ మందు అమ్మకాలను నిలిపివేయాలని, అందుబాటులో ఉన్న స్టాక్ను స్వాధీనం చేసుకోవాలని అన్ని రాష్ట్రాల ను ఆదేశించింది. తమిళనాడులో ఇంకా రెండువేలకు పైగా ’కోల్డ్రిప్’ బాటిళ్లు మార్కెట్లో ఉండే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులు విస్తృతం గా దాడులు చేస్తున్నారు.
కొన్ని రోజులుగా రంగనాథ్పై నిఘా పెట్టిన మధ్యప్రదేశ్ పోలీసులు, తమిళనాడు పోలీసుల సహకారంతో ఆయన్ని అరెస్ట్ చేశారు. తదుపరి విచారణ నిమిత్తం రంగనాథ్ను మధ్యప్రదేశ్కు తరలించనున్నట్లు పోలీ సు వర్గాలు తెలిపాయి. కంపెనీ తయారీ నిబంధనలను ఉల్లంఘించిందా, భద్రతా ప్రమాణా ల్లో నిర్లక్ష్యం వహించిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా రాజస్థాన్ రాష్ట్రంలోనూ కోల్డ్రిఫ్ తాగి చాలా మంది చిన్నపిల్లలు చనిపోయారన్న ఆరోపణలు ఉన్నాయి.
కాగా ఈ ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఆ పిల్ను విచారించేందుకు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ పిల్పై తక్షణమే విచారణ జరపాల్సి ఉందని పిటిషనర్, న్యాయవాది విశాల్ తివేరి పేర్కొన్నారు.