19-11-2025 12:15:21 AM
పాట్నా, నవంబర్ 18: బీహార్లో స్పీకర్ పోస్టును బీజేపీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జేడీయూ ఆ పదవి తమకే కావాలని పట్టుబడుతున్నప్పటికీ, బీజేపీ పంతమే నెగ్గేట్లు కనిపిస్తున్నది. స్పీకర్ పదవి ఒకవేళ బీజేపీ పరమైతే, హోం మంత్రిత్వశాఖ దక్కించుకోవాలని జేడీయూ ఎదురుచూస్తున్నది. గత ప్రభుత్వంలోనూ స్పీకర్ పదవి బీజేపీనే దక్కించుకున్నది. ఈసారి కూడా దాన్ని ఆ పదవి తనకే దక్కాలని బీజేపీ భావిస్తున్నది.
దీనిలో భాగంగానే మంగళవారం పాట్నాలో బీజేపీ, జేడీయూ నేతలు సమావేశమయ్యారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు సుదీర్ఘ చర్చలు జరిపారు. చర్చల్లో స్పీకర్ పదవి బీజేపీకి, హోంశాఖ జేడీయూ తీసుకోవాలని ఒక ఒప్పందానికి వచ్చినట్లు తెలిసింది. స్పీకర్ పదవి బీజేపీ నేత ప్రేమ్కుమార్కు అప్పగించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే.. జేడీయూ సభ్యుల్లో ఎవరికి హోంశాఖ దక్కుతుందనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది. బుధవారం రెండు పార్టీల నేతలు మరోసారి భేటీ కానున్నారు.
భేటీ అనంతరం జేడీయూ అధినేత మరోసారి గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ను కలిసి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించనున్నారు. ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను సమర్పించి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. గురువారం ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువదీరనుంది.