06-08-2025 12:15:01 AM
వనపర్తి, ఆగస్టు 05 ( విజయక్రాంతి ) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని మౌలిక సదుపాయాలతో పాటు తగిన వైద్య సిబ్బంది ఉన్నందున ప్రసవాల సంఖ్య పెంచే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సురక్షితమైన ప్రసవాలు చేస్తారన్న విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించి నమ్మకాన్ని పొందాలని సూచించారు. మంగళవారం కలెక్టర్ పెద్దమందడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నీ సందర్శించారు.
ఆసుపత్రిలో గర్భిణుల ఈ.డి.డి. రిజిస్టరు, ప్రసవాల నమోదు రిజిస్టరు, రక్త పరీక్షల రిజిస్టరు ను పరిశీలించారు. గత నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎన్ని ప్రసవాలు జరిగాయి, ప్రైవేట్ ఆసుపత్రులలో ఎన్ని జరిగాయి అనే వివరాలు రిజిస్టరులో తనిఖీ చేశారు. జులై నెలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేవలం ఒకే ఒక డెలివరీ జరిగినట్లు తెలుసుకున్న కలెక్టర్ ప్రసవాల సంఖ్య పెంచాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులు, సిబ్బంది పై మహిళలకు అవగాహన కల్పించి వారి నమ్మకాన్ని పొందాలని సూచించారు.
ఎరువుల నిల్వ, ధర వివరాల సూచిక బోర్డు పై రాసి పెట్టాలి
ఏ రకమైన ఎరువులు ఎంత మోతాదులో నిల్వలు ఉన్నాయి, వాటి ధర వివరాలను దుకాణం బయట సూచిక బోర్డు పై ఎప్పటికప్పుడు రాసి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు.మంగళ వారం పెద్దమందడి మండలంలోని హాకా ఫార్మర్స్ ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. దుకాణంలో ఏ రకం ఎరువులు ఉన్నాయి? ఎంత నిల్వలు ఉన్నాయి, బోర్డు పై రాసిన నిల్వలు ఆన్లైన్ లో నిక్షిప్తం అయిన నిల్వలను పరిశీలించారు.
సూచిక బోర్డు పై నికర నిల్వలు రాసి పెట్టాలని, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని దుకాణం యజమానిని ప్రశ్నించారు. మండలములో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు అడిగి తెలుసున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా శ్రీనివాసులు, పెద్దమందడి తహసీల్దార్ సరస్వతి, ప్రోగ్రాం ఆఫీసర్ డా.మంజుల, మెడికల్ ఆఫీసర్, ఇతర సిబ్బంది ఉన్నారు.