జిల్లాలో తగినంత ఎరువు నిల్వలు ఉన్నాయి
కృత్రిమ కొరతలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు..
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి టౌన్: వనపర్తి జిల్లాలో ఖరీఫ్ పంటకు అవసరమైన ఎరువు నిల్వలు ఉన్నాయనీ ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా కృత్రిమ కొరతలు సృష్టిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) హెచ్చరించారు. బుధవారం వనపర్తి మున్సిపాలిటీలోని కిసాన్ మిత్ర ఫర్టిలైజర్ షాపును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల బయట రాసిపెట్టిన ఎరువు నిలువలను, షాపు, గోదాములో ఉన్న నిలువలను పరిశీలించారు. యూరియా నిలువలు, డి. ఎ.పి నిలువలు ఆన్లైన్ లో నిక్షిప్తం ఉన్న నిల్వలతో సరిపోల్చి చూసారు. ప్రతి ఎరువుల దుకాణం షాపు ముందు ఎరువుల నిల్వ, ధరల సూచిక బోర్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ ను సూచించారు.
జిల్లాలో రైతులకు సరిపడా యూరియా, ఇతర ఎరువులు ఉన్నాయని, ఎవరైనా డీలర్లు కృత్రిమ కొరతలు సృష్టిస్తే చర్యలు ఉంటాయని చెప్పారు. మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేయాలని, ధరలను పర్యవేక్షించాలని కలెక్టర్ వ్యవసాయధికారికి సూచించారు. అన్ని ఎరువుల దుకాణాల బయట నిలువ, ధరల సూచిక బోర్డు ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిఎపి, యూరియా, జిప్సం, ఫాస్పరస్ వంటి ఎరువుల వివరాలు సూచిక బోర్డుపై ఉండాలని చెప్పారు.






