04-07-2025 12:33:29 AM
విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం
మెదక్, జూలై 3(విజయక్రాంతి): విద్యార్థులను నమోదు శాతం పెంచి వారి భవిష్యత్ ప్రగతికి ఉపాధ్యాయులు మార్గదర్శనం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. గురువారం పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి వసతులు విద్యార్థులకు అందుతున్న విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. మెనూ ప్రకారం నాణ్యత, ప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు పౌష్టిక ఆహరం అందించాలని ఆదేశించారు. 9వ తరగతి విద్యార్థులతో గణిత టీచర్ గా మారి గణిత పాఠాలు బోధించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంక్షేమ కోసం అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తూ యూనిఫామ్, టెస్ట్ బుక్స్ నోట్ బుక్స్ అందిస్తున్నామన్నారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, విద్యార్థులు సంతృప్తితో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సంబంధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.