26-11-2025 12:00:00 AM
అదే ప్రాంగణంలో జిల్లా పరిషత్ హై స్కూల్
మేడ్చల్, నవంబర్ 25(విజయ క్రాంతి): తరగతి గదులు సరిపోవడంలేదని, వాష్ రూమ్ లు లేవని, సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని ఉప్పల్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కలెక్టర్ మను చౌదరికి వివరించారు. మంగళవారం కళాశాలకు వెళ్లిన కలెక్టర్ కు విద్యార్థులు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. 450 మంది విద్యార్థులు ఉంటే కేవలం 5 తరగతి గదులు మాత్రమే ఉన్నాయని తెలిపారు.
జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో డిగ్రీ కళాశాల కొనసాగడం వల్ల హై స్కూల్ కు కూడా గదుల కొరత ఏర్పడుతోంద ని తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ అదనపు గదుల నిర్మాణానికి ఇంజనీరింగ్ వింగ్ వాళ్లతో తనిఖీ చేయించి నిధులు కేటాయిస్తానని తెలిపారు. అదనంగా బాత్రూంలో మంజూరు చేయాలని ప్రిన్సిపాల్ కోరారు. జడ్పీ హైస్కూల్ కు అదనపు గదులు, డైనింగ్ హాల్ కావాలని హెడ్మాస్టర్ కోరారు. ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. కాలేజీ వాచ్మెన్ తనకు సరిగా వేతనం రావడం లేదని కలెక్టర్ కు వినతిపత్రం అందజేయగా, పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు.