ముషీరాబాద్, నవంబర్ 30: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ, క్రిమీలేయర్పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వీఎల్ రాజు, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూప్ పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంట్లో చర్చ జరగాలని వారు డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మాల మమానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, క్రిమీలేయర్కు వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ కోసం నియమించిన ఏకసభ్య కమిషన్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణపై ఏఐసీసీ నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే సీఎం రేవంత్రెడ్డి ఏకసభ్య కమిషన్ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.
పరేడ్ గ్రౌండ్లో జరిగేది మాలల సింహగర్జన కాదని కాంగ్రెస్ సభ అని, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి కోసమే ఈ సభను నిర్వహిస్తున్నారని విమర్శించారు. వర్గీకరణకు మద్దతు తెలుపుతున్న పార్టీల నేతల ఇండ్ల ముందు డిసెంబర్ 7 నుంచి జనవరి 26 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యనిర్వక కార్యదర్శి అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ, హైకోర్టు న్యాయవాది వెంకట్ రావు, మాల మహానాడు నాయకులు జెన్ రావు, శ్రీకాంత్, నక్కా దేవేందర్ రావు పాల్గొన్నారు.