01-12-2024 03:51:20 AM
పోలీసుల అదుపులో నిందితుడు
మేడ్చల్, నవంబర్30: మేడ్చల్ పోలీసులు, టీజీన్యాబ్ సంయుక్తంగా వల పన్ని రూ.50 లక్షలు విలువజేసే కిలో మత్తు పదార్థాన్ని పట్టుకొని, ఒకరిని అరెస్ట్ చేశారు. మేడ్చల్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. డీసీపీ తెలిపిన ప్రకారం మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా అల్ల్లు సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద కిలో మెఫెడ్రోన్ లభించింది.
అతన్ని విచారించగా ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి దందా చేస్తున్నట్లు తేలింది. ముఠాలోని కృష్ణారెడ్డి, చీపిరి సునీల్, ఫయాజ్ అహ్మద్, వాసుదేవచారి ఇటీవల బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే మత్తు పదార్థాన్ని తరలిస్తూ అరెస్టయ్యారు. యాదాద్రి జిల్లాలో మూతపడిన పరిశ్రమలో డ్రగ్ తయారు చేస్తున్నారని డీసీపీ తెలిపారు. కాగా సత్యనారాయణ బొల్లారంలోని రుద్ర టెక్నాలజీ కంపెనీలో షిఫ్ట్ ఇన్చార్జిగా పనిచేస్తున్నాడని.
ఆ అనుభవంతోనే ఈ డ్రగ్ను తయారు చేసినట్లు చెప్పారు. ఈ మత్తు పదార్థం కొకైన్లా పనిచేస్తుందన్నారు.నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, సీఐ సత్యనారాయణలను డీసీపీ అభినందించారు.