10-08-2025 01:29:58 AM
- హిమాయత్ సాగర్ వద్ద ఓఆర్ఆర్పై గ్రేటర్ సిటీ ముఖద్వారం
- గాంధీ సరోవర్కు స్వాగత తోరణం
- అత్యంత ఎత్తుగా ఐకానిక్ టవర్
- బహుళ ప్రయోజనాలు ఉండేలా మూసీ పునరుజ్జీవం
- అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): హైదరాబాద్ కోర్ అర్బన్ సిటీ ఏరియాలో చేపట్టే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ను బహుళ ప్రయోజ నాలుండేలా అత్యంత అధునాతనంగా నిర్మించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేశించారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా హైదరాబాద్ ముఖ ద్వారంగా హిమాయత్ సాగర్ గాంధీ సరోవర్ దగ్గర ఓఆర్ఆర్పై ‘గేట్ వే అఫ్ హైదరాబాద్’ను నిర్మించాలని సూచించారు. ఓఆర్ఆర్కు ఒక వైపున ఎకో థీమ్ పార్క్ అభివృద్ధి చేసి మరోవైపున బాపూఘాట్ వైపు భారీ ఐకానిక్ టవర్ నిర్మించాలని.. అందుకు తగిన విధంగా డిజైన్లు రూపొందించాలని సీఎం అదేశించారు.
ఓఆర్ఆర్కు ఒక వైపున ఉండే ఎకో థీమ్ పార్క్, మరో వైపున నిర్మించే ఐకానిక్ టవర్కు చేరుకునేందుకు ప్రయాణాలకు వీలుగా ఎలివేటెడ్ గేట్వే నిర్మించి దాన్ని గేట్వే అఫ్ హైదరాబాద్గా డిజైన్ చేయాలని అదేశించారు. బాపూఘాట్ చుట్టూ ఉన్న ఏరియాను వరల్డ్ క్లాస్ జోన్గా అందరిని ఆకట్టుకునేలా డిజైన్ చేయాలని చెప్పారు.
అత్తాపూర్ వైపు కొత్త ఫ్లుఓవర్
హిమాయత్ సాగర్ దగ్గర అప్రోచ్ రోడ్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లుఓవర్ నిర్మించాలని ఆదేశంచారు. గాంధీ సరోవర్ చుట్టూ ఈ ఫ్లుఓవర్ కనెక్టివ్ కారిడార్లా ఉండాలని అధికారులకు సూచించారు.
ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా గాంధీ సరోవర్కు చేరుకునేలా ఈ కనెక్టివిటీ ఉండాలన్నారు. గాంధీ సరోవర్ వద్ద నిర్మించే ఐకానిక్ టవర్ ప్రపంచంలోనే ఎత్తున టవర్గా నిర్మించాలని సూచించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని, అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఎంత ఎత్తున నిర్మించాలనేది అంచనాకు రావాలని చెప్పారు.