10-08-2025 01:35:07 AM
- సీఎం రేవంత్రెడ్డితో ఎన్టీపీసీ సీఎండీ గురుదీప్సింగ్
- పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిపై చర్చ
- 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్తుకు అవకాశం
- అన్ని విధాలా సహకరించడానికి సిద్ధం: సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పునరుత్పా దక విద్యుత్తు ఉత్పత్తి రంగంలో భారీ పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తెలిపింది.
శనివారం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ముఖ్య మంత్రి రేవంత్రెడ్డిని ఎన్టీపీసీ చైర్మన్ గురుదీప్సింగ్ బృందం మర్యాద పూర్వకంగా కలుసుకుంది. ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధన వనరులపై చర్చ జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల్లో దాదాపు రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు సీఎం రేవంత్రెడ్డికి ఎన్టీపీసీ బృందం వివరించింది.
అలాగే రాష్ట్రంలో 6,700 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన ఎన్టీపీసీకి అభినందనలు తెలిపారు. తాము అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వారికి సీఎం హామీ ఇచ్చారు.