19-07-2025 12:17:26 AM
సనత్నగర్,(విజయక్రాంతి): సనత్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ కార్యక్రమాలను తన ఇంట్లోనే నిర్వహిస్తూ ప్రోటోకాల్ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని కాంగ్రెస్ పార్టీ స్థానిక మహిళా నాయకులు తెలిపారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి అర్థిక సాయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ మస్తు, షాదీ ముబారక్ చెక్కులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వ కార్యాలయంలో కాకుండా లబ్ధిదారులను, ప్రభుత్వ అధికారులను తన ఇంటికి పిలిపించుకొని పంపిణీ చేస్తూ ప్రోటోకాల్ ను బ్రేక్ చేస్తున్నారని అన్నారు. చెక్కుల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి పేరు కాకుండా మాజీ సీఎం కెసిఆర్ పేరు చెప్తూ లబ్ధిదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కొరకు ఖర్చు చేస్తున్న నిధులను కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించకుండా కెసిఆర్ పేరు చెప్పి పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించాలి కానీ సొంత డబ్బులు ఇచ్చినట్టు ఇంట్లో చేయడం ఏంటని అన్నారు. ఇకనైనా తన తీరు మార్చుకోవాలని కోరారు. మరోవైపు అధికారులు కూడా ప్రోటోకాల్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని.. పెండింగ్ లో ఉన్న కళ్యాణమస్తు, షాదీ ముబారక్ చెక్కుల మంజూరుకు కృషి చేయాలన్నారు.