11-09-2025 12:58:15 AM
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): సమాజంలో వేగంగా పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళన తదితర మానసిక సమస్యలకు పరిష్కారం చూపగల సామర్థ్యం టెక్నాలజీకి ఉందని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ‘సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూపొందించిన ఏఐ ఆధారిత మెంటల్ హెల్త్ సపోర్ట్ సిస్టమ్ ‘హోప్ ఐ’ను ఆయన బుధవారం రాయదుర్గంలోని టీ హబ్లో లాంఛనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని వివరించారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఆవిష్కరణలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఆ దిశగా దృష్టి సారించి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాలని యువ ఆవిష్కర్తలకు సూచించారు. కార్యక్రమంలో టీ హబ్ సీఈవో కవికృత్, సైబర్ హోప్ హెల్ప్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ చైర్మన్ ఇన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.