16-09-2025 06:21:50 PM
మానకొండూర్,(విజయక్రాంతి): భూమి కోసం, భుక్తి కోసం, దాస్య శృంకలాల విముక్తి కోసం పుట్టిందే తెలంగాణ సాయుధ పోరాటమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మంగళవారం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు అనబేరి ప్రభాకర్ రావు విగ్రహానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొన్నగంటి కేదారి, తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతిలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి మీ పార్టీ జెండా ఎగరవేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరుతల్లి ముద్దుబిడ్డ అనబేరి ప్రభాకర్ రావు అని అన్నారు. వెట్టి చాకిరి విముక్తి కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా అణచివేతకు వ్యతిరేకంగా దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా పేద ప్రజల పక్షాన పోరాటాలు చేసిన వీరుడు అనభేరి అని కొనియాడారు. అమరుల త్యాగాలు గుర్తుండేలా ప్రభుత్వాలు పాఠ్యపుస్తకాలలో వారి చరిత్రను ముద్రించాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై అనభేరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.