07-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్ 6 (విజయక్రాంతి) : ఏఐ పరిశోధన, స్టార్టప్లు వేగవంతం చేయడం ద్వారా ఏఐ ఇన్నోవేషన్ హబ్గా తెలంగాణ నిలుస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యులకు ఉపయోగపడితేనే దానికి నిజమైన విలువ అని స్పష్టం చేశారు. గురువారం హైటెక్ సిటీలోని వెస్టిన్ హోటల్లో ఇండియా టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియా టుడే రోబోటిక్స్ అండ్ ఏఐ కాంక్లేవ్’ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్బాబు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అన్ని రంగా ల్లోనూ ఎంతో ప్రయోజనం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు. హైదరాబాద్లోని ఏఐ సిటీలో ఏఐ, రోబోటిక్స్, చిప్స్, డ్రోన్స్, ఆటోమేటిక్ సిస్టమ్స్ రంగాల కోసం 200 ఎకరాలు కేటాయించినట్టు పేర్కొన్నారు. ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తప్పిపోయిన పిల్లలను కుటుంబాలతో కలుపుతోందని, సాగు బాగు కార్యక్ర మం కింద రైతుల పంట దిగుబడులు 21 శాతం పెరిగా యని, ఆస్పత్రుల్లో ఏఐతో క్యాన్సర్ ప్రారంభ దశలోనే గుర్తింపు సాధ్యమవుతుందనని తెలిపారు.
టీబూ ద్వా రా మహిళల భద్రత కోసం ముందస్తు హెచ్చరిక చేరవేసేందుకు ఏఐని ఉపయోగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టాస్క్ ప్రోగ్రాం ద్వారా లక్షలాది విద్యార్థులు ఏఐ, రోబోటిక్స్లో శిక్షణ పొందుతున్నారని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2027 నాటికి 44 శాతం ఉద్యోగ నైపుణ్యాలు మారతాయని, అందుకు తెలంగాణ ముందుగానే సిద్ధమవుతుందన్నారు.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను, పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగాల కల్పనలో ఏఐ దోహదపడుతుందన్నారు. హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి కంపెనీలకు కేంద్రంగా మారుతోందని, ఎలీ లిల్లీ, వాన్ గార్డ్, ఫాక్స్కాన్, ఏఎండీ, మైక్రాన్ వంటి కంపెనీలు ఇక్కడ విస్తరిస్తున్నాయని పేర్కొన్నా రు. 2026 ఆర్థిక సంవత్సరానికి కల్లా తెలం గాణ ఐటీ ఎగుమతులు రూ.3 లక్షల కోట్లను దాటే దిశలో ఉన్నాయని ఆకాంక్షించారు.