తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సమావేశం విజయవంతం చేయాలి
ఉద్యమకారుల ఫోరం పట్టణ కన్వీనర్ విజయ్ కుమార్..
మందమర్రి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణ బస్టాండ్ దగ్గరలోని తారక్ హోటల్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రేపు జరుగనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి పట్టణంలోని మలిదశ తెలంగాణ ఉద్యమకారులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఫోరం పట్టణ కన్వీనర్ కొలుగూరి విజయ్ కుమార్ కోరారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల గ్రౌండ్ లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ అధ్యక్షతన జరుగనున్న సమావేశానికి ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ తరలి రావాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు మండల, జిల్లా కేంద్రాలలో 300 గజాల ఇంటి స్థలం కేటాయించాలని, 10 లక్షల మాఫీ లోన్ ఇంటి నిర్మాణానికి కేటాయించాలని, ఉద్యమకారుల కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల కింద 25 వేల పెన్షన్ మంజూరు చేయాలని, జైలుకు పోవడం అనే నిబంధనతో కాకుండా తెలంగాణ ఉద్యమకారులందరికి సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
పథకాల అమలుకు ప్రత్యేక రిజర్వేషన్ ప్రకటించాలని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు అందజేయాలని, ఉద్యోగాలకు వయసు సరిపోని ఉద్యమకారుల కుటుంబాల పిల్లలకు అవకాశాలు కల్పించాలని, ఉచిత విద్య, వైద్యం అందించాలన్నారు. స్వాతంత్ర సమరయోధులకు కల్పిస్తున్న సౌకర్యాలను తెలంగాణ ఉద్యమకారులకు వర్తింప చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమ కారులు దాసరి రాజనర్సు, కలీం మొయినొద్దీన్, తోగరి వెంకట స్వామి, పాషా, హఫీజ్, జమాల్ పురి నర్సొజీ, కంబాల రాజనర్సు, మాయ శ్రీనివాస్, పెనుకొండ సమ్మయ్య, కాసిపేట స్వామి, మడిపల్లి వెంకటేశ్వర్ గౌడ్ లు పాల్గొన్నారు.






