12-07-2025 08:50:24 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): విద్యుత్తు ఘాతానికి కౌలు రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. విషాద ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదెల్లి గ్రామం లద్దాఫ్ మౌలాన బీ పొలంలో విద్యుత్ మరమ్మతులు చేస్తూ పోకల హన్మాండ్లు (45) అనే కౌలు రైతు శనివారం విద్యుత్ ఘాతుకానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. ముదేల్లి గ్రామానికి చెందిన హన్మాండ్లు, వృత్తి రీత్యా కౌలు రైతుగా పని చేస్తున్నారు.
లద్దఫ్ మౌలానా భీ పొలంలో స్టార్టర్ డబ్బాలో లోపం వచ్చిన నేపథ్యంలో, విద్యుత్ సరఫరా పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. అయితే అప్రమత్తత లోపంతో ఓ విద్యుత్ వైరు తగలడంతో తీవ్రమైన షాక్ తగిలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. హన్మాండ్లుకు భార్య శకుంతల, ఇద్దరు కుమార్తెలు అంజలి, అఖిల ఉన్నారు. మృతుని భార్య శకుంతల ఫిర్యాదు మేరకు గాంధారి ఎఎస్ఐ నర్సయ్య కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.