17-12-2025 12:29:16 AM
హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి) : గోదావరిపై ఏపీ ప్రభుత్వం అక్ర మంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుపైై రాష్ర్ట ప్రభుత్వం మరో సారి పోరాటానికి దిగింది. ఈ ప్రాజెక్టుపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మంగళవారం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోలవరం ప్రాజెక్టును విస్తరించకుండా ఆడ్డుకోవాలని కోరింది. ఇప్పటికే జలవివాదాల విషయంలో కేంద్ర స్థాయిలో కొట్లాడుతున్న ప్రభుత్వం.. తాజాగా మరోసారి సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది.
గతంలో ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన గోదావరి--బనకచర్లపై రాష్ర్ట ప్రభుత్వం కేంద్రంతో పోరా డింది. అయితే.. తాజాగా పోలవరం--నల్లమలసాగర్ పేరిట మరో ప్రాజెక్టుకు ఏపీ రూపకల్పన చేసింది. ఈ మేరకు డీపీఆర్ టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది. దాంతో ఈ ప్రాజెక్టుపైనా రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతోపాటు తాజాగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది.
బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారంటూ రిట్ పిటిషన్దాఖలు చేసింది. ఆర్టికల్32 కింద కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వంతో పాటు సంబంధిత సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసింది. పోలవరం విస్తరణ చేపట్టకుండా అడ్డుకోవాలని అందులో కోరింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ నీటి వాటాను కోల్పోవడమే కాకుండా రాష్ర్ట రైతులకు ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు ద్వారా కేవలం 80 టీఎంసీల నీటినే కృష్ణా నదికి మళ్లించేందుకు అనుమతి ఉన్నదని పేర్కొన్నది. అయితే, ఈ నిబంధనలు అతిక్రమించి ఏపీ ప్రభుత్వం అదనంగా 200 టీఎంసీల నుంచి 300 టీఎంసీల నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని పిటిషన్లో తెలిపింది.
గోదావరి, కృష్ణా నదుల నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా తీవ్రంగా తగ్గిపోతుందని, సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. విభజన చట్టాలకు ఇది పూర్తి విరుద్ధమని, ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని సుప్రీంను కోరింది.