06-07-2025 07:15:03 PM
తంటాలు పడ్డ తల్లిదండ్రులు..
ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట్ మండలంలో ఇంట్లో ఆడుకుంటూ ఓ బాలుడు ఆదివారం కాయిన్ మింగేశాడు. తీరా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే బాలుడిని తీసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట మండలం లింగంపల్లి కుర్దుకు చెందిన బందెల రాజు, సంతోష దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వీరిలో పెద్ద కుమారుడైన రెండేళ్ల తన్వీర్ ఇంట్లో ఆడుకుంటుండగా.. రెండు రూపాయల కాయిన్ మింగేశాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే లింగంపేట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్ రే తీయగా కాయిన్ మధ్యలో ఇరుక్కుందని చెప్పారు. వెంటనే కామారెడ్డి ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో.. కుటుంబ సభ్యులు బాలుడిని కామారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్టీ వైద్యులు ఆధునిక పరికరాలతో బాలుడి గొంతులో ఇరుక్కున్న కాయిన్ తొలగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.