29-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 28 : నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున అగ్ని గుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారి కల్యాణం అనంతరం అగ్నిగుండాల కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యతను సంతరించు కుంది. ఈ అగ్నిగుండాలలో అగ్ని కనికలపై భక్తులు శివనామ స్మరణ చేస్తూ నడవడం వలన స్వామివారి ఆశీస్సులు వారిపై ఉంటాయని ఆనవాయితీగా ప్రతీ యేటా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని అగ్ని కనికలపై నడిచారు. అగ్నిగుండల కార్యక్రమంలో పర్వత వాహనంపై భక్తులకు స్వామి అమ్మవారులు దర్శనమివ్వగా, వీరముష్టి వంశీయులతో మొదటి పూజ అర్చకులు చేయించారు. పోలీసులు, వివిధ శాఖల అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అగ్నికణికలపై నడిచి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా శివసత్తులు నిలిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ తరుపున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.