18-01-2026 02:02:49 AM
సీపీఎస్ యూనియన్ రాష్ట్ర, ప్రధాన కార్యదర్శులు
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతు న్న ముఖగుర్తింపు హాజరు (ఎఫ్ఆర్ఎస్)తో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, ఈ విధానంతో చాలా మంది ఉపాధ్యాయులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ పేర్కొన్నారు. 317 జీవో వల్ల చాలా మంది ఉపాధ్యాయులు తమ సొంత జిల్లా ఒకటి, పనిచేసే జిల్లా మరోకటి కావడంతో సమయానికి హాజరు నమోదు చేయాలనే తొందర పాటు ప్రయాణాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని తెలిపారు.
శనివారం నల్లగొండ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పాఠశాలకు విధులకు వెళ్తున్న నలుగురు టీచర్లలో హెచ్ఎం గీతారెడ్డి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కల్పన ప్రమాదంలో మృతిచెందారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోఘటనలో కరీంనగర్లో శ్రీనివాస చారి అనే టీచర్ తీవ్రంగా గాయపడడం తీవ్రంగా కలిచివేసిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమయానికి చేరుకోవాలనే తొందరలో అనేక మంది ఉపాధ్యాయులు ప్రమాదాల బారినపడుతున్నారని, ఉపాధ్యాయుల భద్రత, ఆరోగ్యం, పని సౌలభ్యం దృష్ట్యా ఈ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానం నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.