13-05-2025 12:00:00 AM
మందమర్రి, మే 12 : సమాజంలో నేరాలను నియంత్రించిన నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే ఆపరేషన్ ‘చబుత్రా’ లక్ష్యమని పట్టణ సీఐ శశిధర్ రెడ్డి తెలిపారు. శనివారం అర్ధరాత్రి పట్టణంలోని పలు ప్రాంతాలలో సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.. అనుమానాస్పదంగా ఉన్న 30 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 18 బైకులు, కారు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
అలాగే మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఇద్దరిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేస్లు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ అర్ధరాత్రి అరుగుల (చబుత్ర) మీద బాతకానీలు కొడుతూ, రోడ్లమీద ఇష్టానుసారం బైకులపై తిరుగుతూ కాలనీ వాసులను ఇబ్బందులకు గురిచేసిన, మద్యం మత్తులో వాహనాలపై తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు గురి చేస్తు, గొడవలు సృష్టిస్తు, అనుమాన స్పదంగా రోడ్లపై తిరుగుతున్న వారిని ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు.
చబుత్ర నిరంతరం నిర్వహిస్తా మని అయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న నేరాలలో మైనర్లు, 30 సంవత్సరాల లోపు వారే అధికంగా ఉంటున్నారని, వీరికి కౌన్సిలింగ్ చేసి మార్పు తీసుకొస్తే నేరాలు తగ్గుముఖం పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేర రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి, రామకృష్ణాపూర్, కాసిపేట ఎస్సులు, సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.