13-01-2026 12:20:49 AM
మేడారం, జనవరి 12 (విజయక్రాంతి): మేడారం మహా జాతరకు ముందుగానే భక్తు లు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు కూడా కలిసి రావడంతో భక్తుల తాకిడి మరింత ఎక్కుగా కనపిస్తున్నది. మూడు రోజులుగా మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం ఒక్కరోజే సుమారు 5 లక్షల మంది మేడారం వచ్చి, సమ్మక్క - సారలమ్మ అమ్మవార్లను దర్శనం చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగింది. సమ్మక్క సారలమ్మ గద్దెలు కిక్కిరిసి కనిపించాయి.
ఇప్పుడే ఇలా వస్తే ఇక మహాజాతర ప్రారంభమయ్యాక ఇంకా ఎంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారనే అంచనా అధికారుల అంచనాకు అందడం లేదు. జాతరకు ముందుగానే భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో అభివృద్ధి పనుల నిర్వహణకు ఆటంకం కలుగుతోంది. వచ్చిపోయే వాహనాలు, జన సందోహం కారణంగా కార్మికులు తమ పనులు చేసుకునేందుకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు సకాలంలో పనులు పూర్తి చేసే దిశగా యంత్రాంగం ముందుకు వెళ్తున్నది.