13-01-2026 12:00:00 AM
రైతులతో కలిసి ఆర్డీఓ, తహసీల్దార్లకు వినతి
కడ్తాల్, జనవరి 12( విజయక్రాంతి): కడ్తాల్ మండలంలో ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డు రోడ్డు ఏర్పాటును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల రైతులు బీఆర్ఎస్ నాయకులతో కలిసి స్థానిక తహసిల్దార్ మరియు రెవెన్యూ డివిజనల్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కందుకూరు రెవెన్యూ డివిజినల్ అధికారి జగదీశ్వర్ రెడ్డి, కడ్తాల్ తహసీల్దార్ జయశ్రీ లకు వినతి పత్రాన్ని అందించి రైతుల బాధలను,నష్టపోతున్న తీరును వివరించి, వారిని ఆదుకోవాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి, ఎల్ ఎచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ రైతులకు అండగా నిలిచారు.
ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం సారవంతమైన వ్యవసాయ భూములను గ్రీన్ ఫీల్డు పేరుతో రైతులనుండి స్వాధీనం చేసుకోవడం అన్యాయమని, రైతుల సమ్మతి లేకుండా ఒక్క ఎకరం కూడా తీసుకోవద్దని డిమాండ్ చేశారు.బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే సహించేదిలేదని హెచ్చరించారు. ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దశరథ్ నాయక్ మాట్లాడుతూ.. కడ్తాల్ మండలంలో వేలాదిమంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వెంటనే గ్రీన్ ఫీల్డు రోడ్డు ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల జీవనాధారమైన భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించాలని నాయకులు కోరారు.
ప్రతిపాదిత రోడ్డుతో ఏ వర్గానికి న్యాయం జరుగుతుందో ప్రభుత్వం తెలపాలని డిమాండ్ చేశారు. రైతులపై భారం మోపే ఈ రోడ్డును రద్దుచేయాలని కోరారు. రైతులకు న్యాయం చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు జోగు వీరయ్య,మాజీ సర్పంచ్ హరిచంద్ నాయక్, కృష్ణయ్య, ముత్యాలు, అమర్ సింగ్, కొట్యా నాయక్, చెన్నయ్య, యాదయ్య, రాఘవ రెడ్డి, శంకర్ రెడ్డి, చంద్రయ్య, జంగయ్య స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.