18-09-2025 12:00:00 AM
-మంచంలో మృతదేహంతో వాగు దాటిన వైనం
ఆదిలాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా నేటికీ ఆదిలాబాద్ జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో ప్రజలు చివరి మజిలీకి సైతం చిక్కులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఉట్నూర్ మండలంలో జరిగిన ఓ ఘటనే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడ వాసి కుమ్ర పారుబాయి (45) అనారోగ్యంతో మృతి చెందింది.
అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబీకులు ఏర్పాట్లు చేశారు. కానీ శ్మశానవాటిక గ్రామంలోని వాగుకు అవతలి వైపు ఉన్నది. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆ ఊరిలోని వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బ్రిడ్జి లేకపోవడంతో మృతదేహాన్ని మంచంలో ఎత్తుకొని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వాగు దాటి శ్మశానవాటికకు చేరుకుని అంత్యక్రియలు నిర్వహించారు.