12-07-2025 12:33:24 AM
అదిలాబాద్, జూలై 11 (విజయక్రాంతి): కాంగ్రెస్ జెండా మోసిన వారికి తప్పకుండ పార్టీ గుర్తిస్తోందని, దీనికి తానే ఒక ఉదాహరణ అని రాజ్యసభ సభ్యుడు, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా ఇన్చార్జీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్లో నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జిల్లాకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. సమావేశంలో ఎంపీ అనిల్కుమార్ యాదవ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తే తప్పకుండ అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు.
సమయం వచ్చినప్పుడు అందరికి అవకాశాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోపక్క ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో మం త్రి వర్గం 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులు అమలుకు కేబినెట్ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ప్రజా సేవలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని వివరించారు. రానున్న రోజుల్లో రాష్ర్టంలో నియోజకవర్గాల పునరవిభజనతో 153 వరకు పెరగనున్నాయని తెలిపారు.
మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి స్వర్గీయ రామచంద్రా రెడ్డి ఆశీర్వాదంతో తాను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలుపొందినట్లు గుర్తుచేశారు. అందరి ఆమోదం తోనే జిల్లా కమిటీ లో పదవులు ఉంటాయని చెప్పారు.
అటు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేయాలని రాష్ర్ట ఉర్దూ అకాడమీ ఛెర్మైన్ తహెర్ బిన్ హందన్ అన్నారు. నాయకులు, కార్యకర్త లు ఐక్యంగా ఉండి పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని సూచించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ను అమలు చేయడం హర్షనీయమన్నారు.
ఈ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీబీ ఛెర్మైన్ అడ్డి భోజరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి, నరేష్ జాదవ్, ఆడే గజేందర్, శ్యామ్ నాయక్, ఇంద్రకరణ్ రెడ్డి, బోరంచు శ్రీకాంత్ రెడ్డి, గణేశ్రెడ్డి, పసుల చంటి, చరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.