30-12-2025 12:14:23 AM
దుబాయి, డిసెంబర్ 29 : యాషెస్ సిరీ స్ బాక్సింగ్ డే టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. పూర్తిగా బౌలర్లు ఆధిపత్యం కనబరిచిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొలిరోజే 20 వికెట్లు పడగా.. ఇరు జట్లూ ఆలౌటయ్యాయి. రెండోరోజు మరో 16 వికెట్లు కలిపి మొత్తం 36 వికెట్లు నేలకూలాయి. దీంతో ఈ పిచ్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి పిచ్లతో టెస్ట్ క్రికెట్ మనుగడ ఎలా సాగుతుం దన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది.
తాజా గా ఐసీసీ మెల్బోర్న్ పిచ్కు అసంతృప్తికరం రేటింగ్ ఇచ్చింది. మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసిపోవడంతో ఒక డీమెరిట్ పాయింట్ కూడా కేటాయించింది. పిచ్ క్యూరేటర్పై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంసీజీ పిచ్ బౌలర్లకు విపరీతంగా అనుకూలించిందని, ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయారని ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫీరస్ సభ్యుడు జెఫ్ క్రోవ్ చెప్పుకొచ్చారు. ఐసీసీ మార్గదర్శకాల ప్రకారం మెల్బోర్న్ పిచ్ సంతృప్తికరంగా లేదన్నారు.
అందుకే డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చామన్నారు. ఇలా 6 డీమెరిట్ పాయింట్లు వస్తే ఆ స్టేడియంలో 12 నెలల పాటు అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించకుండా నిషేధం విధిస్తారు. ఐసీసీ పిచ్ రేటింగ్ ప్రక్రియలో గుడ్ , సంతృప్తికరం, అసంతృప్తికరం, అన్ఫిట్ అనే నాలుగు కేటగిరీలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఐదు టెస్టుల యాషెస్ సిరీస్లో ఆసీస్ 3-1 ఆధిక్యంలో కొనసాగుతోంది.