22-01-2026 01:30:48 AM
క్రాస్ రోడ్లోని బస్ భవన్ ఎదుట ఉద్యోగుల బైఠాయింపు
ఉగాదిలోపు దశలవారీగా సమస్యలు పరిష్కరిస్తాం
ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి
ముషీరాబాద్, జనవరి 21 (విజయక్రాంతి): న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న బస్ భవన్ను గురువారం తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సారాధ్య కమిటీ ఆధ్వర్యంలో వేలాదిమంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు బస్ భవన్ ను ముట్టడించారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగులు ప్లకార్డులు చేత బూని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.
ఈ సందర్భంగా సారాధ్య కమిటీ ప్రతినిధులు లక్ష్మణ్, చంద్రారెడ్డి తదితరులు మాట్లాడుతూ ఆర్పీఎస్ 2017 వేతన బకాయిలు, గ్రాజ్యూటీ, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సానుకూలంగా స్పందించిన ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ ఉగాది లోపు విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ రాజమహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తమ సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.