26-08-2025 01:55:03 AM
మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎంఆర్
రామచంద్రాపురం, ఆగస్టు 25 : తెల్లాపూర్ మున్సిపాలిటీలో హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం దాగి ఉందని, వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ సహిత మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.
వినాయక చవితిని పురస్కరించుకొని సోమవారం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు సాయిబాబా నగర్ కాలనీలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల అంశంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. రసాయనలతో కూడిన ప్రతిమలను చెరువులలో నిమజ్జనం చేయడం మూలంగా జంతుజాలం చనిపోవడంతో పాటు, నీటి కాలుష్యం ఏర్పడుతుందన్నారు.
జిహెచ్ఎంసి, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రజలందరికీ ఉచితంగా మట్టి వినాయకులు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు గౌడ్, వెలిమల పిఎసిఎస్ చైర్మన్ బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీకాంత్ రెడ్డి, నాగరాజు, రవీందర్ రెడ్డి, కొమరయ్య, శ్రీశైలం, మల్లారెడ్డి, శ్రీ పాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.