పల్లె పోరు నేడు రెండో విడత
- 4,333 గ్రామాలు, 38,337 వార్డులకు ఎన్నికలు
- వీటిలో 415 గ్రామాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం
- మొదటి విడతలో 4,230 గ్రామాలు, 27,628 వార్డులకు ఎన్నికలు పూర్తి
- ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్
- 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం
హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ఒకవైపు ఏకగ్రీవాలు.. మరోవైపు చెదురుమదురు సంఘటనలతో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికలు ముగియగా.. రెండో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండో విడతలో రాష్ట్రంలోని 4,333 గ్రామాలు, 38,337 వార్డులకు గాను 415 గ్రామాలు, 8,307 వార్డులు ఏకగ్రీవమైనాయి. దీంతో 3,911 గ్రామాలు, 29,917 వార్డులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి.
ఈ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 57,22,665 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 27,96,006 మంది, మహిళలు 29,26,306 మంది, ఇతరులు 153 మంది. 38,337 పోలింగ్ స్టేషన్లను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
మొదటి విడతలో 4,230 సర్పంచి, 27,628 వార్డులకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది గ్రామాలకు వెళ్లారు. కాగా పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉప సర్పంచి ఎన్నికను కూడా పూర్తి చేయనున్నారు.




