10 April, 2026 | 2:15 AM

రామేశ్వరం కేఫ్ వంటకాలు భేష్

14-12-2025 12:51 AM
  1. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కితాబు
  2. కేటీఆర్‌తో కలిసి కేఫ్‌లో మధ్యాహ్న భోజనం
  3.  కేఫ్ రుచులను ఆస్వాదిస్తూ పలు అంశాలపై ఇరువురు నేతల చర్చ

హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి) : రామేశ్వరం కేఫ్ వంటకాలు అద్భుతమని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కితాబిచ్చారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి శనివారం నగరంలోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. నగరంలో ఎంతో ఆదరణ పొందిన రామేశ్వరం కేఫ్ రుచుల గురించి, అక్కడ లభించే ప్రత్యేకమైన టిఫిన్స్ గురించి తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ ఆసక్తి కనబరచడంతో కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు.

సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాది స్తూనే.. పలు రాజకీయ, సమకాలీన అంశాలపై ముచ్చటించారు. వీరి రాక సందర్భంగా రామేశ్వరం కేఫ్ యజమాని శరత్ ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్.. వాటి నాణ్యతను, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.

హైదరాబాద్‌లోనూ రామేశ్వరం కేఫ్‌ను  విజయవంతంగా నడుపుతుండటం పట్ల యజ మాని శరత్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు అఖిలేష్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు.  అనంతరం, అఖిలేష్ యాదవ్, కేటీఆర్ అక్కడి నుంచి బయలుదేరి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసానికి వెళ్లారు.