10-05-2025 03:11:00 AM
న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్- భారత్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశ ప్రజలు కొంత ఆందోళనలో ఉన్నారు. నిత్యావసర ధరలు పెరుగుతాయి.. ఇంధన ధరలకు రెక్కలు వస్తాయి.. అని సందేహించే వారికి కేంద్ర ప్రభుత్వం తాజాగా స్పష్టమైన హామీ ఇచ్చింది. దేశంలో నిత్యావసరాల కొరతకు తావే లేదని, ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని స్పష్టం చేసింది. ఇవే అంశాలపై శనివారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ ఉన్నతస్థాయి అధికా రులను సమీక్షించారు.
నిత్యావసరాలు దాచి, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. రిటైల్, హోల్సేల్ వ్యాపారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించింది. నిత్యావసర ధరలు పెరిగాయని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ముఖ్యంగా పాక్ టార్గెట్ చేస్తున్న రాజస్థాన్, పంజాబ్, గుజరాత్, జమ్మూకశ్మీర్లో యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉంది.
చండీగఢ్లో నిత్యావసరాల నిల్వలపై మున్సిపాలిటీ ప్రత్యేక నిఘా పెట్టింది. వ్యాపారులందరూ తమ వద్ద ఉన్న నిత్యావసరాల స్టాక్పై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కూరగాయలు, పప్పు ధాన్యాలు, డీజిల్, పెట్రోల్, ఎల్పీజీ.. ఇలా అన్నిరకాల నిల్వలపై అధికారులు నిఘా పెట్టారు.
ముడి చమురుపైన ప్రభావం నిల్
భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడిచమురు వినియోగదారు. దేశ అవసరాలకు రోజుకు సుమారు 5 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు కావాల్సి ఉంటుంది. పాకిస్థాన్ వినియోగం కేవలం 5 లక్షల బ్యారెళ్లు మాత్రమే. రెండు దేశాల మధ్య ఉద్రిక్తల ప్రభావం పెద్దగా ఉండదని ఇండియాకు చెందిన ఆయిల్ కార్పొరేషన్ కంపెనీలు తేల్చిచెప్తున్నాయి. భారత్ ప్రపంచ చమురు మార్కెట్లో 5 శాతం బ్యారెళ్లను వినియోగిస్తున్నాయి. వాటి దిగుమతికి భారత్కు ఎలాంటి అడ్డంకులు లేవు.