18-12-2025 12:53:05 AM
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : పార్లమెంట్లో ప్రజా సమస్యలపై చర్చించే పరిస్థితి లేకుండా పోయిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజల అవసరాలు, రైతులు, మహిళలు, యువత ఉద్యోగాలపై చర్చ చేయడం లేదని విమర్శించారు. స్వాతంత్య్రం కోసం ఆస్తి, ప్రాణాలు ధారదత్తం చేసిన నెహ్రూ, గాంధీ కుటుంబాన్ని టార్గెట్గా బీజేపీ పని చేస్తోందని మండిపడ్డారు.
బుధవారం ఆయన గాంధీభవన్లో ఆ పార్టీ నేత గజ్జి భాస్కర్ యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడా రు. పార్లమెంట్లో జరిగిన వందేమాతరంపై చర్చలో ప్రియాంక గాంధీ దీటుగా సమాధానమిచ్చారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. మొదటగా నెహ్రూపై విమర్శలు చేసిన బీజేపీ, ఇప్పుడు మహాత్మాగాంధీ వరకు వచ్చారని తెలిపారు. నెహ్రూ, గాంధీలపై మోదీ కుట్రలకు నిరసనగా సంగారెడ్డిలో లక్షలాది మందితో భారీ సభను పెట్టబో తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.