18-07-2025 12:00:00 AM
నిమిష ఉరిశిక్ష కేసుపై భారత విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ, జూలై 17: యెమెన్లో మరణ శిక్షను ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసుపై విదేశాంగ శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది చాలా సున్నితమైన అంశమని విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసులో నిమిష ప్రియకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.
ఆమె కుటుంబం కోసం ఒక న్యాయవాదిని నియమించినట్టు ఆయన వెల్లడించారు. కేసు పురోగతి వివరాలను తెలుసుకోవడానికి దౌత్యపరంగా సహాయం అందిస్తున్నామన్నారు. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేలా స్థానిక అధికారులు, కుటుంబ సభ్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు.
ఈ ప్రయత్నాల పలితంగానే ఉరిశిక్ష వాయిదా పడిందని పేర్కొన్నారు. యెమెన్ జాతీయుడి హత్య కేసులో నిమిష ప్రియకు అక్కడి అధికారులు ఉరిశిక్షను ఖరారు చేశారు. జూలై 16న అమలు కావాల్సి ఉండగా.. భారత ప్రభుత్వం ప్రయత్నాలతో తాత్కాలికంగా వాయిదా పడింది.