11-09-2025 10:39:30 PM
ఎమ్మెల్యే
నాగారం: అంకితభావంతో పనిచేసిన వారికి ఎల్లప్పుడు గుర్తింపు లభిస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండి వారిని ఉన్నత స్థాయికి ఎదిగేవిధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యాభివృద్దికి సీఎం రేవంత్రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన విష్ణుమూర్తి, కె.సోమసుందర్, మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి మెమోంటోలు, ప్రశంస పత్రాలు అందజేసి, శాలువాలలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి వాసం ప్రభాకర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఆయా పాఠశాలల హెచ్ఎంఎలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.