24-09-2025 01:32:02 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15వేల మంది డిగ్రీ విద్యార్థినులకు అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ స్కాలర్షిప్ను అందించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ.వీ.బాలకిష్టారెడ్డి తెలిపారు. మాసాబ్ ట్యాంక్లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యామండలి కార్యదర్శి ప్రొ.శ్రీరామ్ వెంకటేష్, అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన తెలంగాణ హెడ్ ఎం.శ్రీనివాసరావుతో కలిసి చైర్మన్ బాలకిష్టారెడ్డి స్కాలర్షిప్ వివరాలను వెల్లడిం చారు.
ప్రభుత్వ స్కూళ్లలో పదో తరగతి, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ పూర్తి చేసిన బాలికలకు డిగ్రీలో ఆర్థిక చేయూతను అందించేందుకు ప్రముఖ టెక్ విప్రో సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అజీమ్ ప్రేమ్ జీ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. ఈ నెల 30 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణతో సహా 18 రాష్ట్రాల్లో 2.50 లక్షల మం దికి స్కాలర్షిప్ అందించాలని ఆ సంస్థ నిర్ణయించినట్లు తెలిపారు. రెండో విడతలో వచ్చే ఏడాది జనవరి నుంచి తిరిగి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.