16-05-2025 01:39:11 AM
48గంటల్లో రెండో ఎన్కౌంటర్
శ్రీనగర్, మే 15: జమ్మూకశ్మీర్లో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం ఘటన తర్వాత జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ము మ్మర వేట సాగిస్తున్నాయి. ఈనేపథ్యంలో పుల్వామా జిల్లా థ్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల సమాచా రంతో భద్రతా బలగాలు అక్కడ తనిఖీలు చేపట్టాయి.
నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు చేపట్టాయి. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ ముఠాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆసిఫ్ అహ్మద్ షేక్, ఆమిర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్ హతమయ్యారు.
పహల్గాం ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్లో 48 గంటల్లో ఎన్కౌంటర్ జరగడం ఇది రెండోసారి. మంగళవారం షోపియాన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భారత బలగాలు మట్టుబెట్టాయి.
అమ్మ చెప్పినా వినకుండా..
ఉగ్రవాది ఆమిర్ నజీర్ వని..గురువారం ఎన్కౌంటర్ జరగడానికి కొద్దిసేపటిముందే అతడి తల్లి, సోదరితో వీడియో కాల్లో మాట్లాడాడు. ఆర్మీ ఎదుట లొంగిపోవాలని వారు ఎంతగా నచ్చజెప్పినా అతడు వినలేదు సరికదా..‘ ఆర్మీని ముందుకు రానివ్వం డి.. వారి సంగతి చూస్తా’ అంటూ పొగరుగా సమాధానమిచ్చాడు. తల్లి, సోదరి ఎంతగా బతిమిలాడిన వినలేదు.
ఇదే ఎన్కౌంటర్లో మృతిచెందిన మరో ఉగ్రవాది ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరితో నూ నజీర్ మాట్లాడాడు. ఆమె తన సోదరుడి గురించి నజీర్ ను అడిగితే తన దగ్గరే ఉన్నాడని సమాధానమిచ్చాడు. ఈ వీడియోకాల్ తర్వాత కొద్దిసేపటికే జరిగిన ఎన్కౌం టర్లో వీరిద్దరూ హతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో కాల్ వైరల్ అవుతోంది. తల్లి చెప్పినా వినకుండా, ఆమె మాటలను పెడచెవిన పెట్టిన కొడుకు చివరకు కాటికి వెళ్లాల్సి వచ్చింది.