20-09-2025 05:33:21 PM
నిర్మల్,(విజయక్రాంతి): బాసర శ్రీ జ్ఞానసరస్వతి ఆలయంలో రేపటి నుండి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు అధికారులు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు ఉత్సవాల కాలంలో భక్తులు అధిక సంఖ్యలో రానున్న కారణంగా ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు. బాసర ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు, షీ టీమ్స్, క్యూఆర్టి టీమ్స్, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, డాగ్ స్క్వాడ్ తదితరులను క్రమబద్ధంగా నియమించారు. మహిళా భక్తుల భద్రత కోసం నిర్మల్ జిల్లా మహిళా ప్రత్యేక బృందం అయిన శివంగి దళాలు పనిచేస్తాయని తెలియజేశారు. భక్తులు శాంతి, భద్రత వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే భక్తులు పోలీస్ శాఖ సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.