23-07-2024 03:55:00 AM
హైదరాబాద్, జూలై 22 (విజయ క్రాంతి) : ఓఆర్ఆర్ పరిధిలోని 21 టోల్ ప్లాజాల గుండా వెళ్లే వాహనదారులందరూ తమ వాహనాలకు తప్పనిసరిగా ఫాస్టాగ్లను అతికించుకోవాలని, లేనిపక్షంలో రెట్టింపు టోల్ ఫీజు చెస్తామని ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే సంస్థ డైరెక్టర్ అమితాబ్ మురార్కా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని నివారించేందుకు తీసుకొచ్చిన ఫాస్టాగ్లను తప్పనిసరిగా తమ వాహనాలకు అతికించుకోవాలని, ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్ఎంసీఎల్) నిబంధనలకు పాటించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, నిబంధనలు పాటించని వాహనాలను బ్లాక్లిస్టులో పెడతామన్నారు. ఓఆర్ఆర్పై ప్రయాణించే వాహనదారులందరూ ఐహెచ్ఎంసీఎల్ సూచనలను, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా, వాహనదారుల విలువైన సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు వారికి మెరుగైన సేవలను అందించేందుకు వీలవుతుందని తెలిపారు.