19-07-2025 12:58:10 AM
హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): తెలంగాణ, రాజస్థాన్ రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త మోసుకొచ్చింది. నేటి నుంచి హైదరాబాద్ నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్కు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభం కానుంది. ఈ మేరకు శనివారం కాచిగూడ స్టేషన్లో కాచిగూడ నుంచి రాజస్థాన్లోని జోధ్పూర్ (భగత్-కి -కోఠి స్టేషన్) మధ్య ప్రయాణించే నూతన ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు.
శనివారం సాయం త్రం 5.30 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ-భగత్ కి కోఠి రైలు సేవలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్ - జోధ్పూర్ మధ్య రోజువారీ రైలు సర్వీసు కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో నూతన రోజువారీ రైలు సర్వీసును ప్రవేశపెట్టడం వల్ల తెలంగాణలో నివసిస్తున్న రాజస్థానీ ప్రజలకు, ముఖ్యంగా నగరంలో నివసిస్తున్న వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.
4 రాష్ట్రాలకు ప్రయోజనకరం
ఈ రైలు తెలంగాణ, మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, రాజస్థాన్లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. నిజామాబాద్, నాందేడ్, పూర్ణా, హింగోలి, వాషిమ్, అకోలా, ఇటార్సి, ఉజ్జయిని, రత్లం, నీమ, చిత్తౌర్గఢ్, భిల్వారా, అజ్మీర్, పాలి మార్వార్ వంటి ఇతర ప్రధాన నగరాలను చేరుకొనే వారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. తెలంగాణలో నివసి స్తున్న మధ్య, వాయువ్య రాష్ట్రాల ప్రజలు తమ స్వస్థలాలకు ప్రయాణించడానికి కొత్త రైలు ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది.
వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యో గులు, సెలవుల్లో విహారాలకు వెళ్లేవారికి ఎంతో ప్రయోజనంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. వాణిజ్య మార్గాలను పెంచడంతో పాటు పర్యాటకం, తీర్థయాత్రలను ప్రోత్సహించేందుకు కూడా ఈ రైలు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.