17-09-2025 02:28:51 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలనేది సీఎం రేవంత్రెడ్డి సంకల్పమని, వారి భవిష్యత్కు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ఇప్పటివరకు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తున్న ట్రాన్స్జెండర్లకు ట్రాఫిక్ నియంత్రణలో అవకాశాలు కల్పించామని, ఇప్పుడు తాజా గా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని మంత్రి చాంబర్లో 20 మంది ట్రాన్స్జెండర్లకు హైదరా బాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సెక్యూరిటీ గార్డులుగా నియామక పత్రాలు అందజేసి మాట్లా డారు. కష్టపడి పనిచేస్తే తోటి ట్రాన్స్జెండర్లకు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. మహిళా, శిశు సంక్షేమ, ఎస్సీ డెవలప్మెంట్ విభాగం సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ...“ఇప్పటి వర కు ట్రాన్స్జెండర్లను తక్కువ చేసి చూశారు.
ఇప్పుడు అదే సమాజం అంగీకరించే పరిస్థితి ఏర్పడుతోంది. ఒక చిన్న అడుగుతో గొప్ప మార్పు సాధ్యం అవుతుంది. మీరు నిజాయితీగా పనిచేస్తే గుర్తింపు మీకే వస్తుంది. గూగు ల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ట్రాన్స్జెండర్ల సేవలకు ఆసక్తి చూపుతున్నాయని, ఈ నియామకాలు ప్రైవేట్, పబ్లిక్ రంగాలపై ప్రభావం చూపి మరిన్ని అవకాశాలు కల్పించేందుకు దోహదపడతాయి” అని ఆమె అన్నారు.
కార్యక్రమంలో డిజేబుల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ శైలజ, ఎస్ఐఎస్ ఇండియా లిమిటెడ్ నిర్వాహకులు గిరిజష్ పాండే, ట్రాన్స్జెండర్లకు యూనిఫామ్లను స్పాన్సర్ చేసిన దీర్ బంధు పేరెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ముకుంద మాల, మౌంట్ ఫాంట్ సోషల్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ వర్గీస్ తెక్కనాథ్, ట్రాన్స్ వెల్ఫేర్ ఫౌండర్ వాసవి తదితరులు పాల్గొన్నారు.